TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు జారీ, కౌంటర్ ఏర్పాటు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.

ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తిస్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో టికెట్లు జారీ చేయు కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరోవైపు టీటీడీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం చేసింది.. వీటిలో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్‌లో 250 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అదనంగా జనవరి 11న మరో 250 టికెట్లు విడుదల చేస్తారు.

ఇదిలా ఉంటే తిరుమలలోని మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో బోర్డింగ్ పాస్‌ ద్వారా ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. అయితే శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను కూడా జతచేయాలి టీటీడీ సూచించింది. టికెట్‌పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పీఏన్‌ఆర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలని తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్‌తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

అంతేకాదు.. తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ తిరిగి ప్రారంభంకానుంది. ఈ సేవను జనవరి 12 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీని కోసం భక్తులు తిరుమలలోని సీఆర్వో కౌంటర్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి జనవరి 11న సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-27T01:33:35Z dg43tfdfdgfd