హైదరాబాద్: డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్ను ముట్టడించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేండ్లు దాటినా ఇంకా రిక్రూట్మెంట్ కొలిక్కి రాలేందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి నెలలో 1:2 నిష్పత్తిలో టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని వెల్లడించారు. డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా నియామకపత్రాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022, సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మే నెలలో పరీక్షలు నిర్వహించింది. అయితే ఇంతవరకు నియామక ప్రక్రియను మాత్రం కమిషన్ పూర్తిచేయలేకపోయింది.
2024-06-11T07:15:12Z dg43tfdfdgfd