జూనియర్‌పై సీనియర్‌ విద్యార్థుల దాడి

  • విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌

మైలార్‌దేవ్‌పల్లి, జూలై 26: మహావీర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జూనియర్‌ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో సీనియర్‌ విద్యార్థులపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహావీర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 23న కళాశాల ఆడిటోరియంలో సెమినార్‌ ఉండటంతో తరగతి గదుల్లోకి వెళ్లి.. హాజరు కావాలని చెప్పాడు. దీంతో సీనియర్‌ విద్యార్థులు.. అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు.. చిన్నగా చెప్పొచ్చుకదా..

అని సూచించారు. దీంతో జూనియర్‌ విద్యార్థి, సీనియర్‌ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శుక్రవారం వీరి మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సీనియర్‌ విద్యార్థులు ఐదుగురు కలిసి జూనియర్‌ విద్యార్థిని బాత్‌రూమ్‌ వద్ద పట్టుకొని గొడవకు దిగుతావా.. అంటూ దాడి చేశారు. దీంతో బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో సీనియర్‌ విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీనియర్‌ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

2024-07-26T19:41:18Z dg43tfdfdgfd