బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలి

  •  టీబీఎస్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మ

హైదరాబాద్‌, జూలై 26 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్‌ఎస్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్‌శర్మ విజ్ఞప్తి చేశారు. గతంలో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోగా, కొత్త బడ్జెట్‌లో కేటాయింపులే లేవని బ్రాహ్మణులంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత కేటాయింపులను విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబును అనేకసార్లు కలిసి వినతిపత్రాలు, పోస్ట్‌కార్డుల ద్వారా కోరినా ఫలితం లేదని తెలిపారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తమకు నిధుల కేటాయింపు, విడుదల విషయంలో స్పష్టత వస్తుందని ఆశించినట్లు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.

2024-07-26T23:19:35Z dg43tfdfdgfd