HYDERABAD ఆ మార్గాల్లో వెళ్లేవారికి అలర్ట్.. రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలో ఆషాడ బోనాల ఉత్సవాలు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఈ వారం పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని బోనాల నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు, ప్రముఖులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఛత్రినాక ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి అక్కన్న మాదన్న ఆలయం వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు ఉంటుంది. దీంతో జులై 28, 29 తేదీల్లో ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహదూర్‌పురా పోలీస్టేషన్‌ల పరిధిలోని పలు ప్రాంతాలు, నయాపూల్‌ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

నెహ్రూ విగ్రహం నుంచి లాల్‌ దర్వాజా ఆలయం వరకు వాహనాలకు అనుమతి లేదు. హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపునుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు... చాంద్రాయణగుట్ట, కందికల్‌గేట్‌ ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఛత్రినాక ఔట్‌పోస్ట్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

జులై 29న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలు ఇంజన్‌బౌలి, జహానుమా, గోశాల వైపు.. పంచ్‌మొహల్లా, చార్మినార్‌, వైపునుంచి వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్‌ వైపు మళ్లిస్తారు. చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌జే రోటరీ, పురాణాహవేలి వైపు.. ఖిల్వత్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లి టీ జంక్షన్‌ నుంచి ఓల్గా జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు.

వాహనాలు పార్కింగ్‌‌కు సంబంధించి కూడా సూచనలు చేశారు. అలియాబాద్‌ వైపు నుంచి బైక్‌లపై వచ్చే భక్తులు తమ వాహనాలను అల్కా థియేటర్‌, దేవీ ఫ్లైవుడ్‌ వద్ద.. హరిబౌలి గౌలిపురా వైపు నుంచి వచ్చేవారు సుధా థియేటర్‌ లైనులోనూ.. మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చేవారు ఛార్మినార్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద నిలుపుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఇందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.

అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్‌రోడ్స్‌, ఇంజన్‌బౌలి, గుల్జార్‌హౌస్‌, ఛార్మినార్‌, హిమ్మత్‌పురా, నాగులచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

ఇక, లాల్‌దర్వాజా బోనాలకు పలు ప్రాంతాల నుంచి 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ బస్సులు సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌, జేబీఎస్‌, జీడిమెట్ల, పటాన్‌చెరు, ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్‌, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, కూకట్‌పల్లి, రిసాలాబజార్‌, చర్లపల్లి, రాజేంద్రనగర్‌, రాంనగర్‌, ఉప్పల్‌, బోరబండ, మిథాని, కేపీహెచ్‌‌బీ కాలనీ, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, బాలాజీనగర్‌ ప్రాంతాల నుంచి నడుస్తాయని చెప్పారు. ప్రయాణికుల సేవల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రేతిఫైల్- 9959226154, కోఠి- 9959226160, లాల్‌ దర్వాజ- 9959226131, ఎంజీబీఎస్‌- 9000406069, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌- 9959226147, జేబీఎస్‌- 9959226144లలో డీఎంలను ఇన్‌చార్జిలుగా నియమించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-27T06:28:44Z dg43tfdfdgfd